మహిళలు మరియు పిల్లలపై ఆన్లైన్ నేరాలను ఎదుర్కోవడానికి సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో హోం సెక్రటరీ గోవింద్ మోహన్ న్యూఢిల్లీలో జాతీయ చర్చను ప్రారంభించారు.
పెరుగుతున్న డిజిటల్ వ్యవస్థలో ఆన్లైన్ నేరాలు సృష్టిస్తున్న సవాళ్లను హోం సెక్రటరీ గోవింద్ మోహన్ తన ప్రసంగంలో వివరించారు. ఇటువంటి నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
నేరాల సత్వర దర్యాప్తు, బాధితులకు మద్దతు, నేరస్థులపై తక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పటిష్టమైన, ప్రత్యేక విభాగాలను, సమన్వయంతో కూడిన ప్రతిస్పందన యంత్రాంగాలను అభివృద్ధి చేసుకోవాలని హోం సెక్రటరీ సూచించారు.
ఆన్లైన్ నేరాల దర్యాప్తునకు, బాధితులకు సత్వర, సమన్వయంతో కూడిన సహాయం అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చట్ట అమలు సంస్థలను ఆదేశించారు. ఇది మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్చా కార్యక్రమాన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నిర్వహించింది. మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ నేరాలను నివారించడానికి, సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై కీలక వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడం దీని లక్ష్యం.

