మదనపల్లె నియోజకవర్గంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, ఆరోపణలు కాకుండా అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. టౌన్ బ్యాంక్ పైన చేసిన ఆరోపణలు అవాస్తవమని, అవసరమైతే సీబీఐ, సీఐడీ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
మదనపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోందని, గత ఐదేళ్ల అరాచకాలకు స్వస్తి పలికి మదనపల్లె రూపురేఖలు మారుస్తూ అభివృద్ధిని కంటికి కనిపించేలా చేస్తోందని పేర్కొన్నారు. లేని అవకతవకలను సృష్టించడం ప్రతిపక్షాలకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు.
మదనపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని, గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, అరాచకాలను తీవ్రంగా ఖండించారు. గతంలో వర్షం పడితే రోడ్లు గుంతలతో నిండిపోయేవని, కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 59 అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.
మదనపల్లె చుట్టూ రింగ్ రోడ్ బైపాస్ కోసం 470 కోట్ల రూపాయల అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని తెలిపారు. గత పాలకులు సీటీఎం చెరువులను సైతం ఆక్రమించి, పేదల డికెటి భూములను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. సిటిఎం విస్తీర్ణలో భాగంగా 22 చెట్లు తొలగిస్తే, దానికి బదులుగా 1000 చెట్లను నాటడం జరిగిందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 చెట్లు నాటే లక్ష్యంతో ముందుకు వెళ్తామని తెలిపారు.











