ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ సంఘటనతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తన భార్యకు 'నేను సేఫ్గా ఇంటికొస్తాను. మన పెళ్లిరోజు బాగా జరుపుకుందాం' అని చెప్పిన చివరి మాటలే సురేష్వి. అయితే, ఈ దాడిలో ఆయన మరణించారనే వార్త కుటుంబ సభ్యులను కుంగదీసింది.
సురేష్ భార్గవి బీబీసీతో మాట్లాడుతూ, "ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపేవారు. వీడియో కాల్ చేసే అవకాశం లేకపోయినా మెసేజ్ మాత్రం వచ్చేది. కానీ రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పుడు ఆయన మరణించారనే వార్త వినాల్సి వచ్చింది" అని కన్నీటి పర్యంతమయ్యారు.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక ఎంటీ సెట్టెబెల్లోపై జరిగిన దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ సిబ్బందిలో 44 ఏళ్ల సురేష్ పట్నాల ఒకరు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారు.
ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.












