భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ (60) అనారోగ్యంతో ఫిబ్రవరి 27న ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన మరణంతో రింకూ సింగ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఖచంద్ర సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతనికి వెంటిలేటర్ సపోర్ట్, CRRT వంటి అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆయన మరణంతో రింకూ సింగ్ కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది.
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లో రింకూ సింగ్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. జింబాబ్వేతో జరగబోయే కీలక మ్యాచ్ కోసం చెన్నైలో శిక్షణ పొందుతున్న ఆయనకు, తండ్రి ఆరోగ్యం విషమించిందన్న వార్త అందగానే వెంటనే గ్రేటర్ నోయిడాకు చేరుకున్నారు. పరిస్థితి మెరుగుపడుతుందని భావించి తిరిగి జట్టులో చేరినప్పటికీ, మళ్ళీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.
రింకూ సింగ్ జీవితంలో ఆయన తండ్రి పాత్ర ఎంతో కీలకం. ఖచంద్ర సింగ్ అలీగఢ్లో దశాబ్దాల పాటు ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించారు. తన తండ్రి పడిన కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని రింకూ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన రింకూ, తన తండ్రి త్యాగాలను ఎన్నడూ మర్చిపోలేదు.
ఈ విషాదకర వార్తపై బీసీసీఐ (BCCI) మరియు సహచర ఆటగాళ్లు రింకూ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో రింకూ తన కుటుంబంతోనే ఉంటారని, అంత్యక్రియల అనంతరం ఆయన తిరిగి జట్టులో ఎప్పుడు చేరుతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని సమాచారం. ఈ క్లిష్ట సమయంలో రింకూకు అందరి మద్దతు అవసరమని క్రీడా వర్గాలు తెలిపాయి.

