తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఐఏఎస్ ల బదిలీల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ సస్పెన్షన్ జరిగినట్లు సమాచారం. గతంలో ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే అనుమతి ఇచ్చారు. బీఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు.
ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వంలో, ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

