Sangareddy/Sadasivpet (డాక్సిన్ టైమ్స్) జూలై 01
ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన ఆలోచనలను అన్వేషించే, నూతన జ్ఞానాన్ని సంపాదించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక కీలకమైన మైలురాయిని అధిగమించిందని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థగా మారడానికి దార్శనికతను అభివృద్ధి చేసుకుందని ప్రశంసించారు.
నూతన ఆలోచనలను అన్వేషించే, నూతన జ్ఞానాన్ని సంపాదించే ధైర్యాన్ని పెంపొందించుకోండి అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురములో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డా.శంకరఆచార్య, ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ.కోరి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక దినం మాత్రమే కాదని, ఈ యువ సంస్థ ప్రస్థానంలో ఇది ఒక కీలకమైన మైలురాయి అని అన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థగా మారడానికి ఈ విశ్వవిద్యాలయం ఒక దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేసుకుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్ల, ముఖ్యంగా నాణ్యమైన విద్యకు సంబంధించిన లక్ష్యాల పట్ల దీనికున్న నిబద్ధత, సమ్మిళిత & సమానత్వ అభివృద్ధి పట్ల బాధ్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రవిశ్వవిద్యాలయం ఒక శ్రేష్ఠతా కేంద్రంగా ఆవిర్భవించి, 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికత సాకారానికి గణనీయంగా దోహదపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.












