ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వన్యప్రాణుల సంరక్షణ పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ దినోత్సవం భూమిని సుసంపన్నం చేసే మరియు పర్యావరణ వ్యవస్థలకు తోడ్పడే అద్భుతమైన జీవవైవిధ్యాన్ని జరుపుకునే సందర్భంగా అని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.
వన్యప్రాణుల రక్షణ కోసం కృషి చేస్తున్న వారందరి ప్రయత్నాలను ఈ రోజు గుర్తిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. భారతదేశం తన వన్యప్రాణులు వృద్ధి చెందేలా సంరక్షణ, స్థిరమైన పద్ధతులు మరియు ఆవాసాల రక్షణకు కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన వన్యప్రాణులకు నిలయమని, ప్రపంచ పులుల జనాభాలో 70 శాతానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఒంటికొమ్ము ఖడ్గమృగాలు మరియు ఆసియా ఏనుగుల అతిపెద్ద జనాభా కూడా భారతదేశంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను కూడా ప్రధాని నొక్కి చెప్పారు. ఉత్తమ పద్ధతులను తోటి దేశాలతో పంచుకోవడానికి ఒక అసాధారణ వేదిక అయిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (International Big Cat Alliance) స్థాపన ఇందులో భాగమని ఆయన తెలిపారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఘరియల్, స్లాత్ బేర్ ల రక్షణ, చిరుతపులుల పునరావాసం వంటి ఇతర ప్రయత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు. మరోవైపు, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని భూమి యొక్క అద్భుతమైన జీవవైవిధ్యాన్ని జరుపుకునే సందర్భంగా అభివర్ణించారు. భారతదేశం తన గొప్ప పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న అనేక ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు.
భారతదేశం తన వద్ద ఉన్నవాటిని సంరక్షించడమే కాకుండా, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉందని మంత్రి యాదవ్ జోడించారు. వన్యప్రాణులు వృద్ధి చెంది, భూమిని సుసంపన్నం చేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

