భారతీయ రైల్వేలో కీలక పాత్ర పోషించే లోకో పైలట్లు (రైలు డ్రైవర్లు) సామూహికంగా రాజీనామాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముంబయి డివిజన్లో 72 మంది లోకో పైలట్లు తమ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించడం, రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడిని, సమస్యలను ఎత్తి చూపుతోంది.
ఈ రాజీనామాలకు గల కారణాలను వివరిస్తూ లోకో పైలట్లు సమర్పించిన లేఖలో, తాము 'మానసిక, శారీరక క్షోభ' అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది కొరత కారణంగా 12 నుండి 15 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఇది వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
లోకో పైలట్లు రైలు ఇంజిన్లలో (Loco Cab) సరైన వసతులు లేవని ఆరోపించారు. సుదీర్ఘ ప్రయాణాల్లో ఇంజిన్లలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం, విపరీతమైన శబ్దం, వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల శారీరక అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. కుటుంబ కార్యక్రమాలకు లేదా అనారోగ్య కారణాలతో సెలవులు మంజూరు కాకపోవడం, అత్యవసర సమయాల్లోనూ డ్యూటీకి రావాలని ఒత్తిడి చేయడం మానసిక వేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.











