ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు చిరుధాన్యాలు ఒక పరిష్కారంగా నిలుస్తున్నాయి. పోషకాహార నిపుణులు వీటిని 'సూపర్ ఫుడ్స్'గా పేర్కొంటూ, ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల అధిక బరువు, మధుమేహం, బీపీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పూర్వీకుల ఆహారమైన చిరుధాన్యాల ప్రాముఖ్యతను నిపుణులు నొక్కి చెబుతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు.
తెల్లటి బియ్యంతో పోలిస్తే, చిరుధాన్యాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు గ్లూకోజ్ విడుదలను నియంత్రిస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరం.
చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలతో పాటు ఐరన్ వంటి పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. మిల్లింగ్ ప్రక్రియలో పోషకాలు కోల్పోయే బియ్యం, గోధుమలకు భిన్నంగా, చిరుధాన్యాలు వాటి సహజ రూపంలోనే ఎక్కువ పోషకాలను అందిస్తాయి.
పోషకాహార నిపుణులు డా. అంజలీ దేవి మాట్లాడుతూ, 'చిరుధాన్యాలు, ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని మొలకెత్తించి, ఉడగబెట్టి లేదా జావ రూపంలో తీసుకోవచ్చు' అని తెలిపారు.












