ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నిషేధిత జాబితాలో ఉన్న 22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఈ విధానం ద్వారా భూ యజమానులకు ఊరట కల్పించనుంది.
గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఈ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెవెన్యూ శాఖకు అందే ఫిర్యాదుల్లో అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో మాదిరిగానే, 22ఏ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహించి, ఈనాం భూములతో పాటు వివిధ రకాల 22ఏ భూముల సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీసీఎల్ఏ స్థాయిలో ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా భూములను గుర్తించి, కలెక్టర్లకు పంపి చర్యలు తీసుకునేలా కేంద్రీకృత విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ అంశంపై నేడు జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.












