కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బంకులకు సంబంధించి 'మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్లెట్స్) ఆర్డర్–2026’ ను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, వాణిజ్య వినియోగదారులకు బల్క్ కొనుగోళ్లపై నిషేధం, డీజిల్ అమ్మకాలపై పరిమితులు వంటి కఠిన ఆంక్షలు విధించారు.
కొత్త ఉత్తర్వుల ప్రకారం, వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ పెట్రోల్ బంకుల నుంచి బల్క్గా ఇంధనం కొనుగోలు చేయరాదు. వీరు తమ అవసరాలకు సొంత వినియోగ పంపుల ద్వారానే ఇంధనాన్ని పొందాలి. తక్కువ ధరల కారణంగా వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల వైపు మళ్లడాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
డీజిల్ అమ్మకాల విషయంలో కూడా కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. పెట్రోల్ బంకులు డీజిల్ను వాహనాల ట్యాంకుల్లోకి లేదా PESO అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాలి. ఒక వినియోగదారుడికి లేదా వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ అమ్మకూడదని స్పష్టం చేశారు.
బంకుల్లో కొనుగోలు చేసిన డీజిల్ను ఇతరులకు తిరిగి విక్రయించడం చట్టవిరుద్ధం. ఈ ఆంక్షలు తాత్కాలికంగా 90 రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది.
ఇంధన నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, మరియు ఇంధన మళ్లింపులపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం–1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.












