దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఈ ఘోర ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లభించలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఉన్నతాధికార వర్గాలు దర్యాప్తు పురోగతిపై కీలక ప్రకటన చేశాయి. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలను వెల్లడించడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు ఓపిక పట్టాలని అధికారులు కోరారు.
ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతోంది. అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే తుది నివేదికను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు నమ్మవద్దని వారు స్పష్టం చేశారు.
విచారణకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని దాచబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చారు. విమాన ఇంజిన్లను తయారు చేసిన 'జీఈ ఏరోస్పేస్' (GE Aerospace) సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో సమన్వయం చేసుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
గతేడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం రన్వే పైనుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు 'రన్ (RUN)' మోడ్ నుండి 'కటాఫ్ (CUTOFF)' మోడ్కు మారాయి. దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయి విమానం కూలిపోయింది. అయితే ఆ స్విచ్లు అంత హఠాత్తుగా ఎందుకు మారాయి? అది సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా లేక మరేదైనా కారణమా? అనే మిస్టరీకి సమాధానం దొరకాలంటే మరో రెండు నెలలు వేచి చూడక తప్పదు.











