దివంగత సినీ నటి శ్రీదేవికి సంబంధించిన చెన్నైలోని 2.7 ఎకరాల భూమి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, వివాదాన్ని కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. తదుపరి విచారణ వరకు ఆస్తిపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది.
చెన్నైలోని షోళింగనల్లూరులో ఉన్న 2.7 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వివాదం, 1988లో శ్రీదేవి తన తల్లి, సోదరితో కలిసి ఆ భూమిని కొనుగోలు చేయడంతో ప్రారంభమైంది. శ్రీదేవి మరణానంతరం 2023లో ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ పేర్లకు రెవెన్యూ పట్టా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, 2025లో ఎంసీ శివకామి, మరికొందరు ఈ భూమిపై తమకు హక్కు ఉందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. తాము ఈ భూమి అసలు సహ యజమానుల్లో ఒకరైన దివంగత ఎంసీ చంద్రశేఖరన్ పిల్లలమని వారు వాదించారు. భూమిలో తమకు ఐదో వంతు వాటా ఉందని, 1988 నాటి భూమి విక్రయ పత్రాలను చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.











