అమరావతి, జూలై 2
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మైనారిటీల సంక్షేమం, సాధికారత, మరియు పారదర్శక న్యాయపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పురోగతి సాధించిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. గత రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు, న్యాయ సంస్కరణలు అమలు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, "స్వర్ణాంధ్రప్రదేశ్–2047" లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం సంక్షేమం, సామాజిక న్యాయం, మైనారిటీల సాధికారత, పారదర్శక న్యాయపాలనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, హజ్ సేవలు, డిజిటల్ పరిపాలన, న్యాయ సంస్కరణలు, కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం, ఈ-కోర్టుల విస్తరణ వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
2026-27లో కూడా మైనారిటీల సాధికారత, సమాన న్యాయం, నాణ్యమైన న్యాయపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి పౌరుడికి న్యాయం, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, 'స్వర్ణాంధ్రప్రదేశ్–2047' విజన్ సాధనలో ఇదే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.












