తిరుపతి, జూన్ 25
తిరుమల యాత్ర ముగించుకుని బెంగళూరుకు వెళ్తున్న కుటుంబం, హోటల్లో సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను మరిచిపోయింది. డయల్-112కు సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, హోటల్ క్యాషియర్ శశి సహాయంతో ఆ బ్యాగ్ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో కుటుంబ వివాహ కార్యక్రమం ముగించుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతున్న ఓ కుటుంబం, మార్గమధ్యలో అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేసింది. ఈ క్రమంలో సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ను అక్కడే మరిచిపోయి వెళ్లిపోయారు.
బెంగళూరుకు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు భరత్ కుమార్ డయల్-112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి హోటల్ వద్ద విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గరుడాద్రి హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్న శశి, కస్టమర్లు మరిచిపోయిన బ్యాగ్ను గమనించారు. అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అత్యంత భద్రంగా దాచిపెట్టి సంరక్షించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల సమక్షంలో బ్యాగ్ను తెరిచి పరిశీలించగా, అందులో ఉన్న సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆ బ్యాగ్ను బాధితుడు భరత్ కుమార్, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో జరిగిన వివాహానికి సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, బ్యాగ్ తిరిగి దొరకకపోతే కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. హోటల్ క్యాషియర్ శశి చూపిన నిజాయితీతోపాటు, డయల్-112కు సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న పోలీసుల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.












