ఐఐటీ బాంబేలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించాడన్న ఆరోపణల నేపథ్యంలో జరిగిన పరిణామాల తర్వాత విద్యార్థి తన హాస్టల్ గదిలో మృతిచెందాడు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగగా, తాజాగా ఐఐటీ బాంబేపై పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐఐటీ బాంబే అధికారిక ప్రకటన ప్రకారం, పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీకి అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సంస్థ తెలిపింది. అయితే విద్యార్థులు మాత్రం, పరీక్ష సమయంలో మరో విద్యార్థి సమాధాన పత్రాన్ని చూస్తున్నట్లు గుర్తించి అతడిని పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించారని, అనంతరం సస్పెన్షన్ సహా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆరోపించారు. ఈ రెండు వాదనలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రారంభించలేదని ఐఐటీ బాంబే స్పష్టం చేసింది. పరీక్షలో జరిగిన విషయాన్ని అధ్యాపకుడు, విభాగాధిపతి విద్యార్థితో చర్చించారని, అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపింది. ఈ ఘటన కారణంగా విద్యార్థి విద్యా భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అతడికి హామీ ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. అనంతరం విద్యార్థి తన హాస్టల్ గదికి వెళ్లినట్లు తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం అతడు గదిలో మృతిచెందిన స్థితిలో కనిపించాడు.











