తెలంగాణలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ఊరట లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీణ్ పథకం కింద రాష్ట్రానికి తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేంద్రం కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో గుర్తించిన అర్హులైన కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, మిగిలిన కుటుంబాలకు కూడా ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
రాష్ట్రంలో నిర్వహించిన ఆవాస్ సర్వే ద్వారా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. వీరందరికీ పీఎంఏవై-జీ కింద ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో కేంద్రాన్ని కోరారు. తాజాగా తొలి విడతగా 2 లక్షల ఇళ్ల కేటాయింపు జరగడంతో, మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కేంద్ర మంత్రితో సీఎం భేటీ
దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు కోసం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్రానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన అర్హులైన కుటుంబాలకు కూడా ఇళ్లను కేటాయించాలని కోరారు.











